రెండు రోజుల పాటు జనసేన క్రియాశీలక సమావేశాలు
ABN , First Publish Date - 2020-11-15T20:53:34+05:30 IST
ఈ నెల 17,18 తేదీల్లో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జనసేన తెలియజేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమరావతి: ఈ నెల 17,18 తేదీల్లో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జనసేన తెలియజేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం ఉంటుంది. ఇక 18వ తేదీ ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. అలాగే మరో 32 నియోజకవర్గాల్లో క్రియాశీల సభ్యత్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో 18వ తేదీ ఉదయం 11 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 8 నెలల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ఆ పార్టీ నాయకులతో నేరుగా భేటీ కాబోతున్నారు.