వైసీపీవా... అయితే ఓకే!

ABN , First Publish Date - 2020-03-13T10:26:27+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రసాభాసగా మారింది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్లు పెద్దసంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలకు...

వైసీపీవా... అయితే ఓకే!

  • కడపలో భారీగా టీడీపీ నామినేషన్ల తిరస్కరణ 
  • పీలేరు బరిలో మిగిలినవారంతా వైసీపీ నేతలే 


కడప/పీలేరు, మార్చి 12: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రసాభాసగా మారింది. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్లు పెద్దసంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలకు 343 నామినేషన్లు దాఖలయ్యాయి. 554 ఎంపీటీసీ స్థానాలకు 2,684 నామినేషన్లు వచ్చాయి. గురువారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా 47 జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కడప డివిజన్‌ పరిధిలో 6మండలాల జడ్పీటీసీ స్థానాలకు టీడీపీ వేసిన నామినేషన్లు మాత్రమే తిరస్కరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమలాపురం నియోజకవర్గం సీకేదిన్నె మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు 15మంది, వైసీపీ అభ్యర్థులు 17మంది, ఇతరులు నలుగురు నామినేషన్లు వేశారు. టీడీపీ, ఇతరులు వేసినవి కలిపి మొత్తం 19 నామినేషన్లను ఆర్‌ఓ తిరస్కరించారు.


బద్వేలులోని బి.కోడూరులో మున్నేపల్లె ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి రాఘవరెడ్డి అన్నీ సక్రమ పత్రాలతో నామినేషన్లు వేసినా, ఓ పత్రాన్ని అధికారులే చింపేసి నామినేషన్‌ను తిరస్కరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో 21నామినేషన్లు తిరస్కరించారు. సరైన కారణాలు చెప్పకుండా తిరస్కరించారని, హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో 56 ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 21 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, జనసేన అభ్యర్థులు వేసిన 35 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే మిగిలాయి.


గుంటరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి ఎంపీటీసీ(ఎస్టీ మహిళ) అభ్యర్థిగా టీడీపీ తరఫున పాలపర్తి దుర్గ నామినేషన్‌ వేశారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆమె ఎస్టీ కాదని, ఓసీ అని వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు చూపి అభర్థిత్వాన్ని తిరస్కరించాలని రిటర్నింగ్‌ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఇదే మండలం అరుంబాక ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన ఎం.శ్రీనివాసరావుపై ఉన్న ఒక కేసును 2007లోనే కొట్టివేసినా ఇతను నేరస్తుడంటూ నామినేషన్‌ తిరస్కరించాలని రిటర్నింగ్‌ అధికారిపై వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ అధికారి రెండు నామినేషన్లను పరిశీలన నిమిత్తం ఆర్డీవోకు పంపారు.

Updated Date - 2020-03-13T10:26:27+05:30 IST