ఓఎంసీ కేసులో నన్ను ఇరికించారు
ABN , First Publish Date - 2020-12-03T09:02:46+05:30 IST
ఓఎంసీ కేసులో నన్ను ఇరికించారు

డిశ్చార్జి పిటిషన్లో సీబీఐ కోర్టుకు మాజీ ఐఏఎస్ కృపానందం నివేదన
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కేసు(ఓఎంసీ)లో దాఖలు చేసిన తొలి చార్జిషీటులో తనపేరు లేదని మాజీ ఐఏఎస్ అధికారి బి.కృపానందం సీబీఐ కోర్టు కు నివేదించారు. తొలి చార్జిషీటు దాఖలు చేసిన 28 నెలల తర్వా త దాఖలు చేసిన 3వ చార్జిషీటులో 8వ నిందితునిగా తనను చేర్చారన్నారు. ఈ కేసులో తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసు నుంచి తనను విముక్తుడిని చేయాలని కోరుతూ కృపానందం దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు చీఫ్ జడ్జి బీఆర్ మధుసూదన్రావు బుధవారం విచారణ చేపట్టారు. కృపానందం తరఫున న్యాయవాది బి.శంకర్ వాదించారు. తొలి రెండు చార్జిషీట్లలో పిటిషనర్ను నిందితునిగా చేర్చలేదని తెలిపారు. ఆ తర్వాత ఇరికించారన్నారు. తాత్కాలిక మైనింగ్ లీజును అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ సిఫారసుల మేరకు కేంద్రం, అటవీశాఖ, జియోలాజికల్ సర్వే, పర్వావరణ తదితర అనుమతులు పొందాలనే షరతులతో ఆమోదించి సంబంధిత మంత్రి పేషీకి పంపినట్లు తెలిపారు.
దీంతో పిటిషనర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీబీ ఐ వాదనలు వింతగా ఉన్నాయన్నారు. తాత్కాలిక మైనింగ్ లీజుకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవంటూనే, మైనింగ్ లీ జు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతోందన్నారు. మ రోవైపు, ఓఎంసీ కేసుతో తనకు కూడా ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్రెడ్డి ఆంతరంగికుడు మెఫజ్ అలీఖాన్ తర పు న్యాయవాది తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో దేవీ ఎంటర్ ప్రైజెస్ భాగస్వామి అని పేర్కొన్నారు కానీ, గాలి జనార్దన్రెడ్డి పీఏగా పేర్కొనలేదని తెలిపారు. ఫోర్జరీ, మోసాలకు పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు.