నైపుణ్యాలతో ఎన్నో అవకాశాలు
ABN , First Publish Date - 2020-02-08T11:09:14+05:30 IST
విద్యార్థులు నైపుణ్యాలను ప్రదర్శిస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయని, అలా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్పర్సన్ భువనేశ్వరి
ఘనంగా ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం
మొయినాబాద్ రూరల్, ఫిబ్రవరి 7: విద్యార్థులు నైపుణ్యాలను ప్రదర్శిస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయని, అలా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమయత్నగర్లోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భువనేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొని దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగం, వ్యాపారం అనే ఆలోచనను దూరంగా ఉంచి కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామర్థ్యాలను బట్టి లక్ష్యాలను ఎప్పటికీ మార్చుకోవద్దని సూచించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో పరీక్షపే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న టెన్త్ విద్యార్థినులు వర్షారెడ్డి, యోగ నందినిలతోపాటు, పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మనవడు నారా దేవాన్షు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో, సిబ్బంది పాల్గొన్నారు.