ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు
ABN , First Publish Date - 2020-07-19T08:32:23+05:30 IST
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరులోని ఎన్టీఆర్ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు పెకలించారు. ఎక్స్కవేటర్తో తొలగించే సమయంలో

- వైసీపీ నేతల దూకుడు.. గుడికి అడ్డుగా ఉందనే సాకు
కావలి, జూలై 18: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరులోని ఎన్టీఆర్ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు పెకలించారు. ఎక్స్కవేటర్తో తొలగించే సమయంలో విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. 2018, జనవరి 8న ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆర్నెల్ల నుంచి దీన్ని తొలగించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహం కాంపౌండ్లో ఉన్న బల్లలను ఇటీవల తొలగించేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకుని జిల్లా ఉన్నతాధికారులు, సబ్కలెక్టర్, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కావలికి వచ్చిన బీజేపీ నేత, ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి కూడా కమిటీ నాయకులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆమె స్పందించి.. విగ్రహాన్ని తొలగించకుండా చర్యలు చేపట్టాలని అప్పటి కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్కు ఓ లేఖ రాశారు. దీంతో కొంతకాలంగా మిన్నకుండిపోయిన వైసీపీ నేతలు.. తాజాగా శనివారం ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించేశారు. గుడికి అడ్డుగా ఉన్నందున దానిని తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలనుకున్నామని, అయితే టీడీపీ నాయకులు ఒప్పుకోలేదని తెలిపారు. దీంతో తామె తొలగించి, విగ్రహాన్ని వారికి అప్పగించినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. విగ్రహం దిమ్మెను దాని చుట్టూ ఉన్న రక్షణ గోడను కూడా ధ్వంసం చేశారు. తొలగించిన విగ్రహాన్ని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పరిశీలించారు. డీఎస్పీ మద్దతుతోనే వైసీపీ నాయకులు ఇదంతా చేశారనీ, పోలీసుల తీరుపై బీద ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కూడా ఈ ఘటనపై ఒక ప్రకటనలో ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.