ఒక్క ప్రాణమూ పోకూడదు
ABN , First Publish Date - 2020-11-26T08:53:39+05:30 IST
నివర్ తుఫానుకు ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ప్రతీక్షణం హై అలర్ట్గా ఉండాలని ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు

‘తుఫాను’ జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): నివర్ తుఫానుకు ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 48 గంటల పాటు ప్రతీక్షణం హై అలర్ట్గా ఉండాలని ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా, రాయలసీమలతోపాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో నివర్ ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్పీలతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల పోలీసులు ఎలాంటి ప్రణాళికతో ఉన్నారో వివరించారు.
‘విపత్తుల సమయంలో ఆస్తులను మనం కాపాడగలమా? లేదా? అనేది కాదు, ప్రాణాలను మాత్రం కచ్చితంగా కాపాడిల్సిందే. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావాస కేంద్రాలకు తరలించండి’ అని ఎస్పీలకు దిశా నిర్దేశం చేశారు. గతంలో విపత్తులను ఎదుర్కొన్న పోలీసు సిబ్బందిని, తగినన్ని వాహనాలు, ఇతరత్రా సౌకర్యాలను సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ ఉన్నతాధికారులు, అగ్నిమాపకశాఖ డీజీలతోనూ డీజీపీమాట్లాడినట్లు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి.