కర్నూలులో సందడి లేని ఘాట్లు..

ABN , First Publish Date - 2020-11-27T09:34:03+05:30 IST

తుంగభద్ర నదికి నీరు పెరగడంతో కర్నూలులోని పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి. గురువారం సుంకేసుల నుంచి నీరు వదలడంతో ఘాట్ల వద్ద నీటిమట్టం అడుగు మేర పెరిగింది.

కర్నూలులో సందడి లేని ఘాట్లు..

మంత్రాలయంలోనే రద్దీ


కర్నూలు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదికి నీరు పెరగడంతో కర్నూలులోని పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి. గురువారం సుంకేసుల నుంచి నీరు వదలడంతో ఘాట్ల వద్ద నీటిమట్టం అడుగు మేర పెరిగింది. అయితే ఏడో రోజు గురువారం కూడా పెద్దగా రద్దీ కనిపించలేదు. రోజూ కాస్త సందడిగా కనిపించే సంకల్బాగ్‌ ఘాట్‌లో కూడా భక్తుల సంఖ్య తగ్గింది. నాగసాయి, షిర్డీ సాయి, నగరేశ్వర, పంప్‌హౌస్‌, మునగాలపాడు, పంచలింగాల తదితర ఘాట్ల వద్దకు భక్తులు వచ్చిన దాఖలాలే లేవు. అయితే, మంత్రాలయంలో మాత్రం గురువారం రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. సంగమేశ్వరం వద్ద కూడా ఈ రోజు భక్తుల రద్దీ తగ్గింది.


కాగా, కర్నూలు పుష్కరాల ఘాట్లలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకుముందు నగరేశ్వర ఘాట్‌లో పాము కనిపించగా, గురువారం సంకల్బాగ్‌ ఘాట్‌లో మరో పాము కనిపించింది. ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు చుట్టుకున్న పామును అక్కడి సిబ్బంది పారదోలడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే రాంబొట్ల పుష్కర ఘాట్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో కూడా పాము కనిపించింది. 

Updated Date - 2020-11-27T09:34:03+05:30 IST