ఏపీలో దేవాలయాలకు రక్షణ లేదు
ABN , First Publish Date - 2020-09-16T17:48:17+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడ నిడమానూరులో సాయిబాబా విగ్రాహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. బాబా విగ్రహం నుంచి తల, కాలు వేరు చేశారు. ఈ ఘటనపై సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మొన్నటికి మొన్న అంతర్వేదిలో రథం దగ్ధం దుమారం రేపింది. పలు చోట్ల హిందూ దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం కావడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. శ్రీకాకుళంలో లింగం నందిని ప్రతిష్టించడం కూడా కలకలం రేపింది. ఇలా వరుస ఘటనలు ఏపీలో కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలు భక్తులు మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయని హిందూ సంఘాలు నేతలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దుమారం రేగింది. ప్రభుత్వం కూడా సీబీఐ విచారణకు ఆదేశించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని వెలగపూడి గోపాల కృష్ణారావు విమర్శించారు. విద్వేషాలకు పాల్పడిన ఆధారాలు దొరికినప్పటికీ ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంవల్లే దాడులు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు.