బట్టబయలైన నిత్యపెళ్లికూతురు బాగోతం
ABN , First Publish Date - 2020-07-27T16:50:26+05:30 IST
నిత్యపెళ్లికూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా: నిత్యపెళ్లికూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది. సెటిల్ అయిన అబ్బాయిలను మాట్రిమోనిలో చూడడం.. పెళ్లి చేసుకుని కొంతకాలం కాపురం చేయడం, ఆ తర్వాత సెటిల్ చేసుకోవడం నిత్యపెళ్లికూతురికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బెదిరిస్తుంటుంది.
తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ యువకుడిపై పీఎస్లో ఫిర్యాదు చేయడంతో నిత్యపెళ్లికూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలు హైదరాబాద్లో కాపురం పెట్టింది. రామాంజనేయులు డెన్మార్కులో ఉద్యోగం చేస్తున్నాడు. తిరిగి డెన్మార్క్ వెళ్లేందుకు భార్య స్వప్న పాస్ పోర్టు అడిగాడు. కానీ తనకు కొంతకాలం ఇక్కడ పనులు ఉన్నాయని చెప్పి తప్పించుకుంది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ డెన్మార్క్ వెళ్లిన రామాంజనేయులకి స్వప్ప వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. కూపీలాగాడు. దీంతో స్వప్న అసలు విషయం బయటకు వచ్చింది. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరు యువకులను వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
తనను మోసం చూసి మూడు పెళ్లిళ్లు చేసుకున్న స్వప్న రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తోందని రామాంజనేయులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యపెళ్లికూతురు నుంచి తమను రక్షించాలని రామాంజనేయ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.