పాడైన రోడ్లకు ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితి: చినరాజప్ప
ABN , First Publish Date - 2020-08-12T19:54:29+05:30 IST
అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ మసి పూసి మారెడు కాయ రీతిన ఉందని..

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ మసి పూసి మారెడు కాయ రీతిన ఉందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పాలసీ వలన చిన్న, సూక్ష్మ పరిశ్రమలు మూతబడే పరిస్థితి రాబోతోందన్నారు. తెలుగుదేశం హయాంలో తూర్పు గోదావరి జిల్లా పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జిల్లాలో అభివృద్ధి అటకెక్కిందన్నారు.
పాడైన రోడ్లకు ప్యాచ్ వర్కులు కూడా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. సంక్షేమంపై మాత్రమే దృష్టి సారిస్తూ.. అభివృద్ధిని గాలికొదిలేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో కోవిడ్ కేసులు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. కరోనా కేసులకు తగ్గ వైద్య సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.