ఏపీ రాజకీయాల్లో దుమారం.. ముగ్గురు వీఐపీల రహస్య భేటీ
ABN , First Publish Date - 2020-06-23T18:44:38+05:30 IST
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో వీరి రహస్య సమావేశం జరిగింది. ఈ నెల 13న జరిగిన భేటీలో సుమారు గంటసేపు చర్చించినట్టు వీడియోల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా రహస్యంగా సమావేశమవ్వడం.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఏపీ ఎన్నికల సంఘం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చల సారాంశం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్క్ హయత్ లాంటి హోటల్లో జరిగిన కీలక సమావేశానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ బయటకు రావడం సందేహాస్పదంగా ఉంది. కావాలనే ఎవరో సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టారన్న వాదనలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ భేటీ రాజకీయంగా తీవ్ర దుమారాన్నే లేపుతోంది. ఎన్నికల సంఘం కేసులో వైసీపీకి అస్త్రం దొరికినట్టేనని ఏబీఎన్ అసోషియేట్ ఎడిటర్ వెంకట కృష్ణ అన్నారు. టీడీపీ నేతలెవరూ ఈ భేటీలో లేకపోవడం ఆ పార్టీకి కాస్త కలిసి వచ్చినా... సుజనా చౌదరి ఉండటం వల్ల దాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకునే అవకాశం ఉందంటున్నారు.