‘మడ’త నిజమే!
ABN , First Publish Date - 2020-12-11T07:43:09+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 100 ఎకరాల్లో మడ అడవులను ధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలను జాతీయ
కాకినాడ ‘లేఅవుట్’లో ఎన్జీటీ పర్యటన
వాస్తవాలను పరిశీలించి అవాక్కయిన బృందం!
ఇదే అంశంపై పలు కథనాలను వెలువరించిన ‘ఆంధ్రజ్యోతి’
పర్యటనను రహస్యంగా ఉంచిన జిల్లా యంత్రాంగం
పర్యావరణవేత్తలతో గొడవకు దిగిన వైసీపీ నేతలు
కాకినాడ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 100 ఎకరాల్లో మడ అడవులను ధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ బృందం గురువారం పరిశీలించింది. స్థలాల చదునుకు మడ చెట్లను నరికివేశారా?లేదా? అనేది పరిశీలించింది. మడచెట్ల ఆనవాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా లేఅవుట్ చేసిన స్థలాల్లో నరికేసిన మడచెట్ల ప్రాంతంలో మళ్లీ చిన్నచిన్న మొక్కలు రావడాన్ని బృందం గమనించింది. సముద్రపు బ్యాక్ వాటర్తో సహజసిద్ధంగా పారే పిల్ల కాలువను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేసిన వైనాన్ని సైతం గుర్తించిన బృందం అవాక్కయింది. ఇళ్ల స్థలాల కోసం మడ అడవులను నరికిన విషయం నిజమేననే డాక్టర్ సి.పాల్పండి, శాస్త్రవేత్త ఎం.మహిమలతో కూడిన ఎన్జీటీ బృందం దాదాపు నిర్ణయానికి వచ్చింది. మడ అడవుల నరికివేత, కాలువల పూడ్చివేత, పర్యావరణ నష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పర్యటనకు వచ్చిన ఎన్జీటీ బృందం తాము పరిశీలిస్తున్న ప్రాంతానికే జిల్లా అటవీశాఖ అధికారిని పిలిచింది. ప్రశ్నల వర్షం కురిపించింది. పిల్ల కాలువను ఎలా మూసివేస్తారంటూ నిలదీసింది. తక్షణం కాలువ తిరిగి పారేలా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ పర్యటన విషయాన్ని రహస్యంగా ఉంచిన జిల్లా అధికారులు... చదును చేసిన దుమ్ములపేట ప్రాంతానికి ఎన్జీటీ బృందాన్ని స్వయంగా తీసుకువెళ్లారు. అసలు అక్కడ మడ అడవులు లేవని, ఒకప్పుడు రొయ్యలు సాగు చేశారనీ సమర్థించుకొనే ప్రయత్నం చేశారు. అవన్నీ రెవెన్యూ భూములేనని నమ్మబలికారు. ఈ ప్రాంతంలో మడ అడవుల చరిత్ర లేదని, ఒకటీ అరా ఉన్నా పలు తుఫాన్లకు ఎప్పుడో పోయాయంటూ అడ్డగోలు అబద్ధాలు వినిపించారు. ఈలోగా ఎన్జీటీ బృందం పర్యటన విషయాన్ని తెలుసుకొన్న పర్యావరణ వేత్తలు, టీడీపీ నేతలు అక్కడకు రావడంతో కథ అడ్డం తిరిగింది.
శాటిలైట్ చిత్రాల సాయంతో వారు, ఎన్జీటీ బృందానికి వాస్తవాలను వివరించారు. మడ నరికివేతపై శాస్త్రీయ ఆధారాలను బృందానికి అందించారు. స్థలాల చదును కోసం పూడ్చివేసిన కాలువను, చదును చేసిన ఇళ్ల స్థలాల్లో మళ్లీ మొలిచిన మొక్కలను మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలోని టీడీపీ బృందం, ఎన్జీటీకి చూపించింది. వాస్తవాలను వివరించే వీడియో క్లిపింగ్లతో కూడిన పెన్ డ్రైవ్లను అందించింది. కాగా విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు స్థలాల వద్దకు వచ్చి పర్యావరణవేత్తలతో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.