ఆ ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని 2 రాష్ట్రాలకూ చెప్పాం
ABN , First Publish Date - 2020-08-11T08:42:23+05:30 IST
కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లవద్దని రెండు

- ఎన్జీటీలో జలశక్తి శాఖ అఫిడవిట్
- పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే మా ప్రయోజనాలకు దెబ్బ
- కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ..
- నేడు హరిత ట్రైబ్యునల్ విచారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లవద్దని రెండు తెలుగు రాష్ట్రాలను కృష్ణా బోర్డు ఆదేశించిందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాయలసీమ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలు చేసిన పిటిషన్పై జలశక్తి శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చే వరకు ప్రాజెక్టులపై ముందుకు వెళ్లవద్దని సూచించామని అందులో తెలిపింది.
కేటాయించిన జలాలను కృష్ణా నది బేసిన్ బయటకు నీటిని మళ్లించడం చట్టబద్ధమేనని.. అయితే బేసిన్ పరిధిలోని ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తపోతల పథకం ప్రాజెక్టుతో తమ ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. 2019-20లో పోతిరెడ్డిపాడు ద్వారా 179 టీఎంసీల నీటిని తోడుకుందని ఆరోపించింది. రాయలసీమ ప్రాజెక్టే అవసరం లేదని స్పష్టం చేసింది. మంగళవారం ఈ కేసును ఎన్జీటీ విచారించనుంది.