కరోనా టెస్ట్ చేయించకపోయినా నెగిటీవ్ వచ్చింది!
ABN , First Publish Date - 2020-09-06T12:53:22+05:30 IST
చంద్రగిరి మండలంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు గందరగోళంగా తయారయ్యాయి. శ్వాబ్ టెస్టు చేసుకోక పోయినా ఫలితం నెగటివ్గా ఇస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం
![కరోనా టెస్ట్ చేయించకపోయినా నెగిటీవ్ వచ్చింది!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020090607214737/09062020072251n90.jpg)
చిత్తూరు: చంద్రగిరి మండలంలో నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు గందరగోళంగా తయారయ్యాయి. శ్వాబ్ టెస్టు చేసుకోక పోయినా ఫలితం నెగటివ్గా ఇస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మండలంలోని నారావారిపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో శ్వాబ్ పరీక్షలు నిర్వహించారు. కొంతమంది శ్వాబ్ పరీక్ష చేసుకుంటామని ఆధార్ కార్డుతో తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరికి శాంపిల్ ఐడీ కూడా వచ్చింది. ఆ తర్వాత కొందరు టెస్ట్కు భయపడి శ్వాబ్ ఇవ్వకనే వెనక్కు వచ్చేశారు. అయితే శనివారం వచ్చిన ఫలితాల్లో శ్వాబ్ పరీక్ష చేసుకోని వారికి కూడా ఫలితం నెగటివ్గా వచ్చిందంటూ సెల్ఫోన్లకు మెసేజ్ రావడంతో వారు అవాక్కవుతున్నారు. మరోవైపు ఫలితాలు ఆలస్యంగా వస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మండలాల్లో శ్వాబ్ పరీక్షలు చేసుకున్న రెండు, మూడు రోజులకే ఫలితాలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. చంద్రగిరిలో మాత్రం నాలుగు, ఐదు రోజులు పడోతుందని వాపోయారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఈ టెస్టులు, ఫలితాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.