జర్నలిస్టులకు నారా లోకేష్ బీమా ధీమా
ABN , First Publish Date - 2020-07-19T21:43:42+05:30 IST
కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు కలిసి పనిచేస్తూ కరోనా కోరల్లో చిక్కి రోజుకో జర్నలిస్టు మృత్యువాతపడటంపై..

మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 62 మంది జర్నలిస్టులకు ఇన్సూరెన్సు
సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే 20 లక్షలకు బీమా
కోవిడ్ మరణాలకూ వర్తించేలా బీమా ప్రీమియంలు చెల్లింపు
అమరావతి: కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్తోపాటు కలిసి పనిచేస్తూ కరోనా కోరల్లో చిక్కి రోజుకో జర్నలిస్టు మృత్యువాతపడటంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తూనే తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రరూపం దాల్చాయి. కోవిడ్ వైరస్ కట్టడికి తమ ప్రాణాలు పణంగా పెడుతున్న వైద్యులూ ఆ వైరస్కి బలి అవుతున్న దుస్థితి నెలకొంది.
కనిపించని వైరస్ వేల కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. దీనిపై తీవ్రంగా ఆలోచించి..ఒక బీమా స్కీమ్ని జర్నలిస్టులకు చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులందరికీ బీమా కల్పించారు.మంగళగిరి నియోజకవర్గం పరిధిలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో పనిచేస్తోన్న ప్రింట్, ఎలక్ర్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కలిపి మొత్తం 62 మందికి బీమా ప్రీమియం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెల్లించారు. ఇన్సూరెన్స్ పత్రాలను ఆయా జర్నలిస్టులకు అందజేయనున్నారు. జూలై 15 నుంచి అమలులోకొచ్చిన జర్నలిస్టుల బీమాతో ఏదైన జరగకూడదని జరిగితే వారి కుటుంబాలకు ధీమా కల్పించేందుకు నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీమా పొందిన జర్నలిస్టుల్లో ఎవరైనా సహజ మరణం (కోవిడ్ వైరస్ వల్ల చనిపోయినా)అయితే నామినీకి 10 లక్షలు, ప్రమాదంలో ఎవరైనా జర్నలిస్టులు మృతి చెందితే వారి నామినీలకు 20 లక్షలకు బీమా వర్తించే పాలసీలను చేయించారు. జర్నలిస్టులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు.త్వరలోనే ఇన్స్యూరెన్స్ ఫారంలు జర్నలిస్టులకు అందజేస్తామని తెలియజేసారు.
కోవిడ్-19 వైరస్ కల్లోలం రేపుతున్న వేళ..వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వైద్య, పారిశుధ్య, అత్యవసర సర్వీసులు అందిస్తున్నవారందరూ కరోనా కాటుకు గురవుతున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడికి కృషి చేస్తున్నవారితోపాటే జర్నలిస్టులూ విధులు నిర్వర్తిస్తున్నారని..అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గం జర్నలిస్టులకు తాను భీమా చేయించానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని,పిపిఈ కిట్లు అందజేయాలని,కోవిడ్ బారిన పడిన మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.జర్నలిస్టులు కూడా విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని, మీపై ఆధారపడిన కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. శానిటజైర్ తమ వెంటే ఉంచుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వీలైనంత దూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరారు.