ప్రజాభిప్రాయం తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-07-05T08:57:34+05:30 IST
రాష్ట్ర రాజధానిగా అమరావతికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతు తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళన 200 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి
- ఏకైక రాజధాని మంచిది
- అమరావతికి రఘురామ మద్దతు
- మూడు అవసరమనుకొంటే
- ఈ ప్రాంతాన్నే పాలనా రాజధాని చేయాలి
- విశాఖను లెజిస్లేటివ్గా పెట్టడం సముచితం
- నా సూచన ప్రభుత్వానికే.. పార్టీకి కాదు
- జేఏసీ వర్చువల్ ర్యాలీలో ప్రసంగం
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మద్దతు తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళన 200 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి జేఏసీ శనివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులు అవసరమనుకొంటే పరిపాలనా రాజధానిగా అమరావతిని ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘రాజధాని మార్పు ఆలోచన పార్టీది కాదు. మా పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయం లేదు. మా పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రాజధానిగా అమరావతే ఉంటుందని ప్రకటించారు. మార్పు ఆలోచన ప్రభుత్వానిది. అందుకే ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘అమరావతి ఏకైక రాజధానిగా ఉంటే మంచిదే. మా ప్రభుత్వం వికేంద్రీకరణ అనుకొంటోంది. అలాంటప్పుడు అమరావతిని పరిపాలనా రాజధానిగా చేసి విశాఖను లెజిస్లేటివ్ రాజధానిగా పెట్టడం సముచితం’ అన్నారు. రాజధానిపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని కోరారు. ప్రజల సెంటిమెంట్ను గుర్తించాలన్నారు.