సబ్బం హరి ఇల్లు కూల్చేయడం అన్యాయం.. : రఘురాజు
ABN , First Publish Date - 2020-10-03T19:54:01+05:30 IST
టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది.

ఢిల్లీ : టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్రమ కట్టడాలని అధికారులు చెబుతుండగా.. ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చర్యను పలువురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించారు.
ఎందుకిలా చేస్తున్నారు!?
‘నోటీసు ఇవ్వకుండా సబ్బంహరి ఇల్లు కూల్చేయడం అన్యాయం. పేద మహిళ వినియోగించే బాత్రూమ్ సైతం అర్ధరాత్రి కూల్చివేయడం మీ సంస్కారానికి నిదర్శనం. మహాత్మాగాంధీ మరో రూపంగా చెప్పుకునే మీరు ఇళ్ల కూల్చివేతకు ఎందుకు పాల్పడుతున్నారు?. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతి ఇంటి నిర్మాణానికి పనికిరాని ఆవ భూములను అధిక ధరలు చెల్లించి మీ వాళ్లకు లబ్ధిచేకూర్చలేదా?. సబ్బంహరి ఇల్లు కూల్చివేత స్ఫూర్తిని ఇళ్ల స్థలాల అక్రమార్కులపై ఎందుకు చూపరు?’ అని రఘురాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.