రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలన్న హైకోర్టు వ్యాఖ్యలపై రఘురామ రాజు
ABN , First Publish Date - 2020-11-03T21:10:15+05:30 IST
రాజ్యాంగబద్ద సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించిన విషయాన్ని జగన్ సర్కార్ గుర్తించాలని నర్సాపురం ఎంపీ రఘురామరాజు సూచించారు.
ఢిల్లీ: రాజ్యాంగబద్ద సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించిన విషయాన్ని జగన్ సర్కార్ గుర్తించాలని నర్సాపురం ఎంపీ రఘురామరాజు సూచించారు. తన నివాసంలో జరిగిన రచ్చబండలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల కమిషనర్గా కనగరాజు ఉన్నప్పుడు కోర్టు కేసు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నియామకం చాలా సజావుగా జరిగిందని ప్రభుత్వం వాదించిందని, దానికి అయిన ఖర్చును ఎన్నికల కమిషన్ చెల్లించాలని అడిగితే, అది కుదరదని హైకోర్టు తేల్చి చెప్పిందన్నారు.
‘‘చేసిందే తప్పు. కనగరాజు బిల్లులను ఆయనే చెల్లించుకోవాలని మొట్టికాయలు వేసింది. రాజ్యాంగబద్ధ సంస్థల పట్ల ఇలాంటి తీరు సరికాదని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. రాజ్యాంగబద్ద సంస్థలు శాశ్వత సంస్థలు. ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఘాటుగా హెచ్చరించింది. కాబట్టి మళ్లీ కంప్లైంట్లు ఇచ్చి.. సమస్యలు కొనితెచ్చుకోవద్దు. మీరు అంతపెద్ద ఉత్తరం రాసేశారు.. ఎవరైనా భయపడ్డారా.. దీనిపై ఇంకో లేఖ రాస్తారా... అయ్యిందేదో అయ్యింది. ఇకపై న్యాయవ్యవస్థను గౌరవించుకుందాం’’ అని ప్రభుత్వానికి రఘురామరాజు సూచించారు.