వైసీపీ ఎంపీ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు..

ABN , First Publish Date - 2020-12-28T18:35:44+05:30 IST

తుళ్లూరు మండలం, వెలగపూడిలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు.

వైసీపీ ఎంపీ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు..

గుంటూరు జిల్లా: తుళ్లూరు మండలం, వెలగపూడిలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. తనకు ఓటేసినవారిలో కూడా తన..మన తేడా చూపించి వారిని రెండు వర్గాలుగా చీల్చి వారిమధ్య తగాదా పెట్టారు. ఈ గొడవలో ఓ మహిళ చనిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. వెలగపూడిలో హోంమంత్రి మేకతోటి సుచరితను నిరసనకారులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న ఆమెను బాధితులు చుట్టిముట్టారు. హోంమంత్రి సమక్షంలో నందిగం సురేష్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బాధితులను పోలీసులు నెట్టివేశారు.


అలాగే వెలగపూడికి వచ్చిన ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, నాగార్జునను కూడా బాధితులు అడ్డుకున్నారు. మృతి చెందిన మరియమ్మ ఇంటికి శ్రీదేవి వెళ్లగా ఆమెను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై శాపనార్థాలు పెట్టారు. ‘మేం పార్టీ చూశాం.. మీరు కులం చూస్తున్నారని’ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారు పోలీసుల సాయంతో బయటపడ్డారు.


వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. వెలగపూడిలో రెండు దళిత వర్గాల మధ్య ఘర్షణను ఆయన ప్రొత్సహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ స్టార్ గుర్తు, ఆర్చి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లుగా సమాచారం. గత రాత్రి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. పలువురు గాయపడ్దారు. వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.


గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోంది. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. జగజ్జీవన్‌రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై మరొక వర్గం అభ్యరంతరం వ్యక్తం చేసింది. దీంతో అన్ని విషయాల్లో ఇరు వర్గాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి.

Updated Date - 2020-12-28T18:35:44+05:30 IST