సోమేశ్వరరావు విషయంలో తమ్మినేని స్పష్టత ఇవ్వాలి: టీడీపీ నేత
ABN , First Publish Date - 2020-09-16T18:25:09+05:30 IST
అవినీతి, అక్రమ వ్యాపారాలకు ఆదర్శంగా తమ్మినేని నిలిచారని... స్పీకర్ పదవిని తప్పుడు పనులకు వాడుకుంటున్నారని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు.

అమరావతి: అవినీతి, అక్రమ వ్యాపారాలకు ఆదర్శంగా తమ్మినేని నిలిచారని... స్పీకర్ పదవిని తప్పుడు పనులకు వాడుకుంటున్నారని టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. సోమేశ్వరరావు విషయంలో స్పీకర్ తమ్మినేని వెంటనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ్మినేని సీతారాం వ్యవస్థలకు, సమాజానికి, శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. అవినీతి పరులకు, అక్రమార్కులకు ఆదర్శంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల్లో తమ్మినేని పేరు దుర్మార్గమన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్లో ఉద్యోగాల పేరుతో మోసగిస్తూ ఆయన కుర్చీని అవమానించారని వ్యాఖ్యానించారు. అధికారాన్ని, పరపతిని అక్రమార్జనకు, అక్రమ వ్యాపారాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆముదాలవలసలో అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు తీవ్రమయ్యాయన్నారు. నాగావళి, వంశధారను ఊడ్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమేశ్వరరావు అనే వ్యక్తి విషయంలో వచ్చే ఆరోపణలపై స్పీకర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఏ హోదాలో అసెంబ్లీ, సెక్రటేరియేట్కు సోమేశ్వరరావు వస్తున్నారని ప్రశ్నించారు. సోమేశ్వరరావు, స్పీకర్ తమ్మినేని సంబంధాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఎలా క్లారిటీ ఇస్తారని వీరాంజనేయస్వామి నిలదీశారు.