పొరపాటు ఖరీదు నిండు ప్రాణం!
ABN , First Publish Date - 2020-07-08T08:39:10+05:30 IST
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజులపాటు తీవ్ర మానసిక క్షోభను
- గుండె నొప్పితో ప్రైవేటులో చేరిక.. కరోనా అంటూ గెంటివేత
- బాధితురాలు మృతి.. గుంటూరులో ఓ కుటుంబం ఆవేదన
గుంటూరు(సంగడిగుంట), జూలై 7: కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజులపాటు తీవ్ర మానసిక క్షోభను మిగిల్చింది. అం దరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని నిలువునా కూల్చేసింది. పైగా కరోనా అంటూ ఆ కుటుంబంపై చిన్నచూపు. ఇన్ని బాధల నేపథ్యంలో పొరపాటు జరిగిపోయింది.. ఆమెకు కరోనా పాజిటివ్ కాదు అంటూ చిన్న ‘సారీ’తో సరిపెట్టేశారు. అధికారుల పొరపాటుతో గుంటూరులో జరిగిన ఘటన వివరాలివి..
గుంటూరులో ని హనుమయ్య నగర్కు చెందిన కొండాబత్తిని తిరుపతమ్మ(64)కు గతనెల 22న గుండెపోటు రావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి సిబ్బంది ఆమె శాంపిల్ సేకరించి జీఎంసీకి పంపారు. ఫలితం వచ్చాక చికిత్స చేస్తామన్నారు. 24న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తిరుపతమ్మకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆమెను వెంటనే తీసుకెళ్లాలని లేదంటే తామే బయటకు పంపించేస్తామని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అదేరోజు రాత్రి గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. 25న ఉదయం తిరుపతమ్మకు మరోసారి గుండెపోటు రావడంతో ఆమె మృతిచెందారు. ఇదే సమయంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది ఆమె ఇంటి చుట్టూ కంచె నిర్మించి.. చుట్టుపక్కల వారికి అప్రమత్తం చేశారు. కరోనా నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులెవరూ లేకుండానే జీఎంసీ సిబ్బంది అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఇక, జూలై 7న ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసి తిరుపతమ్మకు కరోనా సోకలేదని, మున్పిపల్ సిబ్బంది పొరపాటు కారణంగా కరోనా అని పంపేశామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు వెళ్లి వాకబు చేస్తే పరీక్ష ఫలితం నెగెటివ్ వచ్చిందని తేలింది. ఒకవేళ ఆమెకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించారా అంటే.. అదీ లేదు. జూన్ 22న ఒకేసారి పరీక్ష చేశారు. కానీ, ఇన్ని రోజులుగా తాము పడుతున్న మానసిక వేదనను ఎవరు తీరుస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.