కరోనా దాస్తే దాగేది కాదు
ABN , First Publish Date - 2020-04-08T09:03:35+05:30 IST
రాష్ట్రంలో కోవిడ్ వైర్సను దాచిపెట్టాల్సిన అవసరం లేదని, అది దాస్తే దాగేది కూడా కాదని రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.

బాబు పరాయిరాష్ట్రంలో ఉన్నారు
మంత్రి పేర్ని నాని ఆగ్రహం
విజయవాడ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోవిడ్ వైర్సను దాచిపెట్టాల్సిన అవసరం లేదని, అది దాస్తే దాగేది కూడా కాదని రాష్ట్ర రవాణా, సమాచార, పౌరసంబంధాల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి మంగళవారం సాయంత్రం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
పరాయి రాష్ట్రంలో హోం క్వారంటైన్లో ఉన్న నాయకుడు (చంద్రబాబు).. ఇక్కడ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని, అంతా దాచిపెడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారని, ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదని అన్నారు. నర్సీపట్నానికి చెందిన ఒక డాక్టరు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ‘అతను డాక్టరా? రాజకీయ నాయకుడా? ఆ డాక్టరు గాడికి బలుపు ఎక్కువ కాకపోతే.. తెలంగాణలో బాగా చేస్తున్నారు.. ఇక్కడ బాగా చేయడం లేదని ముఖ్యమంత్రుల గురించిమాట్లాడతాడా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.