పారిశ్రామికాభివృద్ధికి చర్యలు: మంత్రి మేకపాటి

ABN , First Publish Date - 2020-05-17T10:00:46+05:30 IST

కొవిడ్‌కు ముందు-కొవిడ్‌కు తర్వాత అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

పారిశ్రామికాభివృద్ధికి చర్యలు: మంత్రి మేకపాటి

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌కు ముందు-కొవిడ్‌కు తర్వాత అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమ(ఎంఎ్‌సఎంఈ)లకు గత ఐదేళ్ల ప్రోత్సాహక బకాయిలు చెల్లిస్తున్నామని, రూ.188 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. అసోచామ్‌ శనివారం నిర్వహించిన వెబ్‌నార్‌లో మేకపాటి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల పరిశ్రమలశాఖ మంత్రులు దీనికి హాజరయ్యారు.


ఇందులో గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ... కొవిడ్‌తో అందివచ్చిన అవకాశాలను ఆంధ్రప్రదేశ్‌ అందిపుచ్చుకుంటుందన్నారు. పరిశ్రమలకు అన్నిరకాలుగా సహాయం అందించి, కార్మికుల్లో విశ్వాసం నెలకొల్పి ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఐటీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, యువత భాగస్వామ్యంతో ఉరకలెత్తిస్తామని చెప్పారు. కరోనా సమయంలోనూ అటు సంక్షేమ కార్యక్రమాలు, ఇటు పరిశ్రమల అభివృద్ధికి తమ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అండగా నిలిచారన్నారు. హరియాణా డిప్యూటీ సీఎం దుశ్యంత్‌ చౌతాలా, తెలంగాణ అధికారులు, వియత్నాం దౌత్యవేత్త తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T10:00:46+05:30 IST