అమరావతిపై మంత్రి బొత్స తాజా వ్యాఖ్యాలు ఇవీ..
ABN , First Publish Date - 2020-08-14T00:26:33+05:30 IST
నవ్యాంధ్ర రాజధాని విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మీడియా ముందుకొచ్చారు.
అమరావతి : నవ్యాంధ్ర రాజధాని విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మీడియా ముందుకొచ్చారు. గురువారం నాడు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అంశాన్ని రైతులు, రియల్టర్లు గమనించాలని ఆయన సూచించారు. ఈ ప్రాంత అభివృద్దికి సంబంధించిన బాధ్యత ప్రభుత్వానిదేనని మరోసారి స్పష్టం చేశారు.
రైతులకు సూచన
ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని.. రైతులు లేనిపోని అపోహలు వద్దని చెప్పారు. టీడీపీ చెప్పే మాటలను రైతులు నమ్మొద్దని బొత్స సూచించారు. అమరావతి ప్రాంతం కూడా ఏపీలో అంతర్భాగమేనని ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం జగన్ లక్ష్యమని మంత్రి తెలిపారు.
అందర్నీ పిలుస్తాం..!
‘అమరావతి ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా అభివృద్ది చేయాలని గతంలో నిర్ణయించాం. అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తాం. వాటి వినియోగానికి మా వద్ద ప్రణాళిక ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అభివృద్ది విపక్షనేత చంద్రబాబుకి అవసరం లేదు. ఓటమి చెందినప్పటి నుంచి ఆయన విపక్షనాయకుడి బాధ్యత విస్మరించారు. ఆ బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. వికేంద్రీకరణ చట్టం ఆమోదం పొందగానే విశాఖలో శంఖుస్థాపన చేయాలని భావించాం. తెలుగుదేశం లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆగదు. సాంప్రదాయంలో భాగంగానే శంకుస్థాపనకు ప్రధానికి, దేశంలోని పెద్దలు అందరిని పిలుస్తాం’ అని బొత్స మీడియాకు వెల్లడించారు.