మద్దతు ధరే కొనుగోళ్లకు బెంచ్ మార్క్
ABN , First Publish Date - 2020-10-01T07:58:20+05:30 IST
‘‘పంట ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎక్కడా కొనుగోలు జరగకూడదు. వీలుంటే ఇంకాస్త ఎక్కువ ధర ఇచ్చేలా చూడాలి. రైతుకు ఏ విధంగా నష్టం జరగరాదు. ఈ విషయంలో రాజీ లేదు’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు...
- తాడేపల్లిలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘పంట ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎక్కడా కొనుగోలు జరగకూడదు. వీలుంటే ఇంకాస్త ఎక్కువ ధర ఇచ్చేలా చూడాలి. రైతుకు ఏ విధంగా నష్టం జరగరాదు. ఈ విషయంలో రాజీ లేదు’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరల అమలుపై అధికారులతో సమీక్షించారు. ‘‘రైతు ఉత్పత్తుల కొనుగోలుకు మార్కెట్లో పోటీ ఏర్పడాలి. అవసరమైతే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీ ఏర్పడేలా చేస్తుంది. పంటలకు ముందుగానే అక్టోబరు 1న కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాం. ఈ ఏడాది రూ.3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లోనే మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతు ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్ సంస్థలను ఈ బజార్లకు తీసుకురావాలన్నారు.