కన్వీనర్‌ కోటా సీటు 4.32 లక్షలే!

ABN , First Publish Date - 2020-05-30T08:46:22+05:30 IST

మెడికల్‌, డెంటల్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ఏడాదితో పొల్చితే అన్ని కేటగిరిల్లో..

కన్వీనర్‌ కోటా సీటు 4.32 లక్షలే!

బీ-కేటగిరీ ఫీజు 8.64 లక్షలు

మెడికల్‌, డెంటల్‌ ఫీజుల తగ్గింపు

70% వరకు తగ్గిస్తూ ఆరోగ్యశాఖ జీవో


అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మెడికల్‌, డెంటల్‌ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ఏడాదితో పొల్చితే అన్ని కేటగిరిల్లో 70% వరకు ఫీజుల్లో కోత విధించింది. మెడికల్‌లో కన్వీనర్‌ కోటా ఫీజు రూ.6.90 లక్షల నుంచి రూ.4.32 లక్షకు తగ్గించారు. అదేవిధంగా గత ఏడాది రూ.24 లక్షలున్న యాజమాన్య కోటా ఫీజును రూ.8.64 లక్షలకు కుదించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


కొత్తగా నిర్ణయించిన ఫీజులు 2020-21, 2022-23 వరకు అమల్లో ఉంటాయి. ఈ ఫీజుల్లోనే ట్యూషన్‌, అడ్మిషన్‌, స్పెషల్‌, లేబొరేటరీ, కంప్యూటర్‌, ఇంటర్నేట్‌ ఫీజులు ఉంటాయి. ఆయా ఫీజులను మెడికల్‌ కాలేజీలు విద్యార్థుల దగ్గర నుంచి రెండు విడతల్లో కట్టించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫీజులు కాకుండా విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఆయా మెడికల్‌ కాలేజీలకు భారీ జరిమానా విధిస్తామన్నారు.


 

Updated Date - 2020-05-30T08:46:22+05:30 IST