సీఎం జగన్కు లేఖ.. మరో అవకాశం ఇవ్వాలని విజ్ఙప్తి
ABN , First Publish Date - 2020-07-07T02:59:29+05:30 IST
సీఎం జగన్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్ర రవాణా రంగం సంక్షోభంలో ..
అమరావతి: సీఎం జగన్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఈశ్వరరావు లేఖ రాశారు. రాష్ట్ర రవాణా రంగం సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి నుంచి వినియోగదారులు వరకు ఉన్న సప్లై పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. మార్కెట్లో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్పై 11 రూపాయల వరకు పెంచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను చెల్లింపునకు తమ అభ్యర్థన మేరకు అదనంగా రెండు నెలల పాటు గడువు ఇచ్చారని తెలిపారు. తమరు ఇచ్చిన వెసులుబాటులో కూడా చెల్లించలేని దుర్భర స్థితిలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సమయంలో చెల్లించని వారికి 50 శాతం అపరాధ రుసుం చెల్లించాలని కంప్యూటర్లో సమాచారం వస్తుందని ఈశ్వరరావు లేఖలో పేర్కొన్నారు. ఇబ్బందులు ఉన్నా జూన్ 30వ తేదీకి ముందే చాలా మంది అప్పులు చేసి మరీ చెల్లించారని, కొంతమంది అవకాశం లేకపోవడంతో చెల్లించలేదని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, నేషనల్ పర్మిట్ రెన్యువల్, చలానా లేకుండా కేంద్రం రెండు నెలలు అదనంగా గడువు పెంచిందని, కావున రెండో త్రైమాసిక పన్ను, ఇతర పన్నులు చెల్లించేందుకు మరో రెండు నెలలు పొడిగిస్తూ అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ను ఈశ్వరరావు కోరారు.