సభలో లోకేష్ ఫోటోలు తీయొచ్చా..?: బొత్స
ABN , First Publish Date - 2020-06-18T22:47:21+05:30 IST
సభలో లోకేష్ ఫోటోలు తీయొచ్చా..? ఇది ఉల్లంఘన కాదా? అని మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.

అమరావతి: సభలో లోకేష్ ఫోటోలు తీయొచ్చా..? ఇది ఉల్లంఘన కాదా? అని మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాకు పంపుతున్నారని, ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఆపమని చెప్పినా ఆపలేదన్నారు. అప్పుడు స్పీకర్కు ఫిర్యాదు చేశామన్నారు. స్పీకర్ చెప్పినా లోకేష్ వినలేదన్నారు. టీడీపీ నేతలకు చట్టాలపట్ల గౌరవంలేదన్నారు. మండలిలో బలం ఉందని చెప్పి.. అడ్డుకుంటున్నారని మంత్రి విమర్శించారు.
ఇంతా చేసి ఇవాళ గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారని.. అంటే టీడీపీ నేతలు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని మంత్రి బొత్స అన్నారు. ఇవన్నీ పనికిమాలినవని.. ఏమైనా వ్యూహాలు రచిస్తే అవి రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా ధర్మం తమవైపు ఉందని, ప్రజల ఆశీస్సులు ప్రభుత్వానికి ఉన్నాయన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.