అధికారపు అడ్డుగోడలు బద్దలుకొడతాం
ABN , First Publish Date - 2020-12-05T09:02:28+05:30 IST
తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను ఎలా అడ్డుకొంటారని వైసీపీ నాయకులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్
రైతులను పరామర్శిస్తుంటే అడ్డుకుంటారా?
పోలీసులు అక్రమకేసులు పెడితే గుర్తు పెట్టుకుంటాం
చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటనల్లో హెచ్చరిక
నెల్లూరు, శ్రీకాళహస్తి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను ఎలా అడ్డుకొంటారని వైసీపీ నాయకులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి జనసేన అంటే ఎందుకంత భయమని నిలదీశారు. రాష్ట్రమేమైనా వైసీపీ జాగీరా అని ప్రశ్నించారు. నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చేస్తున్న పర్యటనలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పర్యటన ముగించుకుని నాయుడుపేట, గూడూరుల మీదుగా నెల్లూరు చేరుకున్నారు.
ఈ సందర్భంగా అధికారపక్షంపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంపై వైసీపీకి ఎంత హక్కు ఉందో, జనసేనకూ అంతే హక్కు ఉందని, అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని ప్రయత్నిస్తే వాటిని బద్దలుకొట్టుకొని ముందుకు వెళ్తామని పవన్ హెచ్చరించారు. ‘‘ఓడిపోతే చాలామంది బయటకురారు. ఆశయం ఉన్నవాడికి గెలుపోటములతో పనిలేదు. వైసీపీ నాయకులను చాలెంజ్ చేస్తున్నా. ‘రైతుల వద్దకు వెళ్లనీయకుండా నన్ను ఆపగలరా? ఎంత మందిని ఆపుతారు? ఇక్కడికి వచ్చిన జనసైనికులను ఆపండి.. చూద్దాం. నేను రైతులను పరామర్శించేందుకు వచ్చాను.. మీతో గొడవపెట్టుకోవడానికి కాదు. మేం వైసీపీ నాయకులను రెచ్చగొట్టడం లేదు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం చూస్తూ ఊరుకోం. రోడ్ల మీదకు రావడానికి కూడా వెనుకాడం’’ అని హితవుపలికారు. పోలీసులంటే తనకు చాలా గౌరవముందని, ప్రభుత్వం మాట విని తమ పార్టీ కార్యకర్తలపై కేసులుపెడితే అందరినీ గుర్తు పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు.