ల్యాండ్ టైటిల్ బిల్లు వెనక్కి
ABN , First Publish Date - 2020-12-03T09:11:00+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ బిల్లు -2019ను సర్కారు వెనక్కి తీసుకుంది. కేంద్రం సూచించిన సవరణలతో కొత్తగా మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

మోక్షం కష్టమేనని ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ బిల్లు -2019ను సర్కారు వెనక్కి తీసుకుంది. కేంద్రం సూచించిన సవరణలతో కొత్తగా మరో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దేశంలోనే తొలిసారి అంటూ.. గత ఏడాది జూలైలో ల్యాండ్ టైటిల్ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూ వివాదాల పరిష్కారంతోపాటు యజమానులకు శాశ్వత భూమి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో సర్కారు ఈ బిల్లును రూపొందించింది. ఉభయసభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. అయితే, కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టం-1908, భూ సేకరణ చట్టం-2013లోని ఐదారు అంశాలకు పోటీగా, వాటిని తోసిరాజేలా ఈ బిల్లులోని పలు రూల్స్ ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని మార్చుకోవాల్సిందేనని కేంద్రం ఇటీవల స్పష్టంచేసింది. ఇదే అంశంపై ‘కేంద్రం భూషాక్’ శీర్షికన ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది. కాగా, తాజా అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇంతకుముందు ఆమోదించిన ల్యాండ్ టైటిల్ బిల్లు-2019ను ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ధ్రువీకరించారు.
గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి 105 ఎకరాలు
విజయనగరం జిల్లా కురుపాం మండలం టెక్రాఖండిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి 105.32 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది.