విద్యుత్తు సంస్థల్లో బదిలీలు కొలిక్కి
ABN , First Publish Date - 2020-09-14T08:38:30+05:30 IST
రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక విద్యుత్తు
తిరుపతి(ఆటోనగర్), సెప్టెంబరు 13: రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక విద్యుత్తు పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. ఈ సమస్యకు శుక్ర, శనివారాల్లో మూడు విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలతో విజిలెన్స్ విభాగం జేఎండీ వెంకటేశ్వరరావు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలతోపాటు ఏపీలోని మూడు కంపెనీల్లో పనిచేస్తున్న విద్యుత్తు ఉద్యోగులు బదిలీల కోసం నిరీక్షించారు. ఉద్యోగులు తమ బదిలీల సమస్యను పరిష్కరించాలని పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విజిలెన్స్ విభాగం జేఎండీ వెంకటేశ్వరరావును చైర్మన్గా.. సీఎండీలు హెచ్.హరనాథరావు(ఎస్పీడీసీఎల్), పద్మజనార్దన్రెడ్డి(సీపీడీసీఎల్), నాగలక్ష్మి(ఈపీడీసీఎల్)లను సభ్యులుగా ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని నియమించింది. వీరు రెండ్రోజులపాటు ఉద్యోగుల కేటాయింపుల అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
1,555 మంది ఉద్యోగుల నుంచి వ్యక్తిగత అభిప్రాయాలను అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మూడు సంస్థల్లో కోరిన ప్రాంతాలకు పంపడానికి అంగీకరించారు. మిగిలిన 39 మంది ఉద్యోగుల విషయంలో తప్పనిసరి బదిలీలు చేసినట్లు తెలిసింది. వీరి విషయాన్ని పునఃపరిశీలించాలని కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తిరిగి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.