కియా మోటర్స్ తరలింపు వివాదంపై మరోసారి కుండబద్దలు కొట్టిన రాయిటర్స్
ABN , First Publish Date - 2020-02-10T01:44:47+05:30 IST
కియా మోటర్స్ తరలింపు వివాదంపై రాయిటర్స్ వార్తా సంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది. కియా ప్లాన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి ..
కియా మోటర్స్ తరలింపు వివాదంపై రాయిటర్స్ వార్తా సంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది. కియా ప్లాన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రాలకు తరలించేందుకు కంపెనీ చర్చలు జరుపుతోందన్న తమ కథనం పూర్తిగా వాస్తవమేనని సమర్థించుకుంటోంది. ఈ మేరకు గతంలో చేసిన ట్వీట్కు సవరణతో మరోసారి ట్వీట్ చేసింది రాయిటర్స్.
కియా మోటర్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాన్ను ఏపీ నుంచి తరలించేందుకు చర్చలు జరుపుతోందని తమకు సమాచారం ఉందంటూ రాయిటర్స్ ట్వీట్ చేసింది. అలాగే పాత ట్వీట్ను డిలిట్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో పాటు ఈ నెల 5న తమ వైబ్ సైట్లో కియా మోటర్స్ తరలిపోతున్నట్టు రాసిన కథనంలో మార్పులు చేసి ఆ లింకును మరోసారి ట్విట్టర్లో జోడించింది.
కొత్త ప్రభుత్వం తమ పాలసీలో మార్పు చేయడంతో ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు ప్లాంట్ను తరలించేందుకు కియా సంస్థ చర్చలు జరుపుతోందని రాయిటర్స్ తెలిపింది. తరలింపు ఖర్చును కూడా తమిళనాడు ప్రభుత్వం బరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తమ కథనంలో రాసుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం అధికార వర్గాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరించినట్టు స్పష్టం చేసింది.
వచ్చేవారంలో సెక్రటరీ స్థాయి అధికారులతో మీటింగ్ కూడా ఉంటుందని, ఆ తర్వాత ప్లాంటు తరలింపుపై స్పష్టత వస్తుందని ఆ అధికారి తమతో చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
ఏపీ నుంచి ప్లాంట్ తరలింపునకు గల కారణాలను ఇటీవల జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో కియా ప్రతినిథులను రాయిటర్స్ సంప్రదించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కొందరి నుంచి ఉచితంగా కార్లు కావాలంటూ వేధింపులు వస్తున్నాయని, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారని, అలాగే డీలర్స్ షిప్స్, ఇన్సెంటివ్స్లో మార్పులు చేయాలంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయని కూడా రాయిటర్స్ వివరించింది.