ఫ్యాక్షన్ లీడర్ సీఎం కావడం దురదృష్టం: కన్నా
ABN , First Publish Date - 2020-04-22T01:00:46+05:30 IST
ఫ్యాక్షన్ లీడర్ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతల భాషను..

హైదరాబాద్: ఫ్యాక్షన్ లీడర్ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనమేనని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కరోనాపై వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దాస్తోందని కన్నా పేర్కొన్నారు.
ప్రభుత్వంపై పోరాడుతున్నందుకు తనను టార్గెట్ చేశారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు బెదిరిస్తే బెదరమని... ప్రజాసమస్యలపై పోరాడతామని కన్నా చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. బీజేపీ తరుపునే పోరాడుతున్నానని, తన వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచే సంప్రదాయం బీజేపీది కాదని చెప్పారు. ఏపీలో కరోనా విజృంభిస్తోందన్నారు. ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి పెచ్చరిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనాపై వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదని విమర్శించారు. రాజకీయాలే పరమావధిగా వైసీపీ పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలను వైసీపీ గాలికొదిలేసిందని మండిపడ్డారు. అధికారమదంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని కన్నా పేర్కొన్నారు.