ఉక్కిరిబిక్కిరై అర్ధాంతంగా ప్రెస్మీట్ ముగించిన జస్టిస్ ఈశ్వరయ్య
ABN , First Publish Date - 2020-08-09T22:26:02+05:30 IST
రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఆడియో టేప్లోని గొంతు ఈశ్వరయ్యదేనని బెంగళూరుకు చెందిన ట్రూత్ల్యాబ్ నిర్ధారించింది.
అమరావతి: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఆడియో టేప్లోని గొంతు ఈశ్వరయ్యదేనని బెంగళూరుకు చెందిన ట్రూత్ల్యాబ్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈశ్వరయ్య తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇబ్బందులు పడ్డారు. ఆడియో టేపుల అంశాన్ని మీడియా లెవనెత్తింది. అయితే ఆడియో టేపులపై వివరణ ఇవ్వలేక రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఇబ్బందులు పడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనాలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్మీట్ నిర్వహించారు. అయితే మీడియా సమావేశంలో తడబడి అర్ధాంతరంగా ఈశ్వరయ్య వెళ్లిపోయారు.
ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్నా.. హోదా చెప్పుకునేందుకు ఆయన ఇష్టపడలేదు. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం బీసీ కార్డును ఈశ్వరయ్య ప్రయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎట్టకేలకు తన ఫోన్ సంభాషణ వాస్తవమేనని ఆయన ఒప్పుకోవడం గమనార్హం. న్యాయమూర్తులపై తిట్ల దండకం సంగతేంటని ప్రశ్నిస్తే.. కోర్టులో మ్యాటర్ ఉందని ఆ పశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. సామాజిక న్యాయం గురించి పరితపిస్తున్నాన్న ఈశ్వరయ్యను.. ఏపీలో సామాజిక న్యాయానికి తూట్లు పడుతుంటే ఎందుకు మాట్లాడలేదని మీడియా ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు. మీడియా ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై అర్ధాంతంగా ప్రెస్మీట్ ముగించిన ఈశ్వరయ్య వెళ్లిపోయారు.