ఏపీకి జస్టిస్‌ బాగ్చీ

ABN , First Publish Date - 2020-12-17T09:52:47+05:30 IST

పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు జడ్జిలకు స్థానచలనం కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై అధికారిక ప్రకటన వెలువడింది.

ఏపీకి జస్టిస్‌ బాగ్చీ

కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ.. రాష్ట్రానికి మరో న్యాయమూర్తి

తెలుగు రాష్ట్రాలు సహా నలుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ

ఐదుగురు జడ్జిలకు సీజేలుగా పదోన్నతి.. ఐదుగురికి స్థాన చలనం

సుప్రీం కొలీజియం సిఫారసు.. అధికారిక ప్రకటన విడుదల


న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతోపాటు జడ్జిలకు స్థానచలనం కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలోని నలుగురు  చీఫ్‌ జస్టిస్‌లను బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. మరో ఐదుగురు న్యాయమూర్తులను కూడా బదిలీ చేసింది. తెలుగు రాష్ట్రాల చీఫ్‌ జస్టి్‌సలతో సహా పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సోమవారం కొలీజియం సిఫారసు చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.


ఏపీ చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి స్థానంలో సిక్కిం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామిని నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్‌ జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని తీర్మానించింది. అలాగే... కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. రా ష్ట్ర హైకోర్టులో ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఈ నెల చివరికి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బాగ్చీని ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇక... తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ స్థానంలో ప్రస్తుతం ఢిల్లీ  హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లిని నియమించింది. జస్టిస్‌  రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. 


జస్టిస్‌ మురళీధర్‌కు పదోన్నతి: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ మురళీధర్‌ను రాత్రికి రాత్రి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్‌- హరియాణా కోర్టుకు బదిలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఒడిసా ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం   కొలీజియం సిఫారసు చేయడం గమనార్హం. ఇక... కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సంజీవ్‌ బెనర్జీకి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌కు జమ్మూ కశ్మీర్‌  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సుధాంశు ధులియాను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమించారు.


మరిన్ని బదిలీలు...: ఒడిసా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహమ్మద్‌ రఫీ  మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ కాగా... మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ యాదవ్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు పంపాలని కొలీజియం సిఫారసు చేసింది. జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ను కలకత్తా హైకోర్టుకు... మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వినీత్‌ కొఠారిని గుజరాత్‌ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇక... మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.

 

‘హక్కుల’ వాదనల నుంచి...: ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగ్చీ 2011 నుంచి కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.  ఆయన మానవ హక్కులకోసం పోరాడే న్యాయవాదిగా గుర్తింపు పొం దారు. జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ 1966 అక్టోబరు 3న జన్మించారు. ఆయ న విద్యాభ్యాసం కోల్‌కతాలో సాగింది. 1991లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1991లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ రచించిన ద్వికోన్‌డిటో పుస్తకంపై బెంగాల్‌ ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ఆయన విజయవంతంగా వాదనలు వినిపించారు. మానవ హక్కుల సంఘాల తరఫున దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఆయన వాదనలు వినిపించారు.

Updated Date - 2020-12-17T09:52:47+05:30 IST