పిఠాపురం, బిట్రగుంట కేసులూ నిగ్గుతేల్చాలి: జనసేనాని

ABN , First Publish Date - 2020-09-12T09:09:10+05:30 IST

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకే సీబీఐ పరిమితం కారాదని,

పిఠాపురం, బిట్రగుంట కేసులూ నిగ్గుతేల్చాలి: జనసేనాని

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ జగన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకే సీబీఐ పరిమితం కారాదని, పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో కూడా నిగ్గుతేల్చాలన్నారు. తిరుమల శ్రీవారి పింక్‌ డైమండ్‌, శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం అంటే సమస్య పరిష్కారమైనట్లు కాదని.. నిందితులను పట్టుకోవడానికి వేసిన తొలి అడుగు మాత్రమేనని వ్యాఖ్యానించారు. అంతర్వేదిలో అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలన్నారు.


భవిష్యత్‌లో అంతర్వేది వంటి ఘటనలు జరక్కుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలని పవన్‌ చెప్పారు. దానివైపు వేసే తొలి అడుగే శుక్రవారం నిర్వహించిన ’మహిళల జ్యోతి ప్రజ్వలన’ కార్యక్రమమని అన్నారు. ఽసెప్టెంబరు 11 అంటే స్వామి వివేకానంద షికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగిందో ప్రపంచానికి చాటిన రోజని గుర్తుచేశారు. కాగా.. ‘పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు. సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా మతాలను సహనంగా చూడడం’ అని పవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T09:09:10+05:30 IST