పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం: పవన్‌కళ్యాణ్

ABN , First Publish Date - 2020-06-23T19:23:58+05:30 IST

పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం: పవన్‌కళ్యాణ్

పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం: పవన్‌కళ్యాణ్

అమరావతి: కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. ఈ  నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు. పదో తరగతి రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.


డిగ్రీతో పాటు ఎం.బి.ఎ., ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ., లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదని పవన్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్‌లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని తెలిపారు. 


మరో వైపు - పై చదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్ సెలెక్షన్స్‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని తెలిపారు. పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్థులు జనసేన దృష్టికి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్‌ కళ్యాణ్ కోరారు. 

Updated Date - 2020-06-23T19:23:58+05:30 IST