‘జగనన్న ఇంట్లో’ సీఎం
ABN , First Publish Date - 2020-08-20T07:46:58+05:30 IST
‘జగనన్న ఇంట్లో’ సీఎం
తాడేపల్లి టౌన్, ఆగస్టు 19: పేదల కోసం నిర్మిస్తున్న ‘జగనన్న ఇళ్లు’ నమూనాను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. బుధవారం సచివాలయంలో కేబినెట్ మీటింగ్ ముగించుకుని తిరిగి వెళుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపల్ పరిధిలోని సీతానగరం వద్ద గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్ వద్ద సీఎం ఆగారు. ఇల్లు మొత్తం కలియతిరిగి పరిశీలించారు. నిర్మాణంలో వాడిన సామగ్రి, నాణ్యత తదితర విషయాలను అధికారులు ఆయనకు వివరించారు. లివింగ్ రూమ్, ఒక బెడ్రూమ్, కిచెన్, బయట వరండా, బాత్రూమ్తో మోడల్ హౌస్ను రూపొందించారు.
మొదటి విడతలో 15లక్షలు, రెండవ విడతలో మరో 15 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. సీఎం వెంట గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంత్రులు కొడాలి నాని, మేకపాటి గౌతంరెడ్డి తదితరులున్నారు.