అంబేడ్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-07-08T23:34:12+05:30 IST
విజయవాడ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

విజయవాడ: విజయవాడ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అంబేడ్కర్ విగ్రహంతోపాటు, అంబేడ్కర్ స్మారక భవనం మరియు గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. 20 ఎకరాల్లో ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు విశ్వరూప్, ఆదిములపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైనారు.
అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్ ఉద్యానవనాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. తొలి దశలో 125 అడుగుల ఎత్తైన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, రెండో దశలో మైదానాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంబేడ్కర్ స్మారక కేంద్రం, లైబ్రరీ, అధ్యయన కేంద్రం, ఓపెన్ ఎయిర్ థియేటర్ను ఇక్కడ నిర్మించనున్నారు. దీనికి ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉన్న భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు బదలాయించినట్టు అధికారులు తెలిపారు.