దివంగత ప్రధాని పీవీ, వివేకాను ఘోరంగా అవమానించిందెవరు!?

ABN , First Publish Date - 2020-12-27T18:36:33+05:30 IST

నెల్లూరులో దివంగత ప్రధాని పీవీ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాని ఘోరంగా అవమానించింది

దివంగత ప్రధాని పీవీ, వివేకాను ఘోరంగా అవమానించిందెవరు!?

నెల్లూరులో దివంగత ప్రధాని పీవీ, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాని ఘోరంగా అవమానించింది ఎవరు? స్థానిక టీడీపీ నాయకులు మున్సిపల్‌ అధికారులపై ఎందుకు నిప్పులు చెరిగారు. ఆనం వివేకానంద రెడ్డి కుటుంబం అధికార వైసీపీపై మండిపడుతుందెందుకు? ఆనం సోదరుడి స్పందన ఎలా ఉంది? ఫ్యాన్‌ పార్టీలో విభేదాలకి అసలు కారణం ఎవరు? మంత్రి అనిల్ కుమార్ మరోసారి ఏ విషయంలో విఫలమయ్యారు? వాచ్ దిస్ స్టోరీ. 


అసలేం జరిగింది..!?

ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఇలాకా నెల్లూరులో కక్ష్య, వర్గ రాజకీయాలకి నెలవుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన పరిణామాలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత ఆనం వివేకానందరెడ్డిని అవమానించడాన్ని విపక్ష టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టిడీపీ నాయకుడు ఉచ్చు భువనీశ్వరప్రసాద్ ఏటా పీవీ, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గాంధీబొమ్మ సెంటర్ వద్ద పీవీ వర్ధంతి వేడుకలు జరిపారు. అయితే ఈ కార్యక్రమం ముగిసీ ముగియక ముందే మున్సిపల్ సిబ్బంది పీవీ ఫ్లెక్సీలను తొలగించి చెత్త ట్రాక్టర్‌లో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ  నేతలు భగ్గుమన్నారు. ఆ ఫ్లెక్సీలను తిరిగి తీసుకొచ్చి పాలాభిషేకం చేశారు. పీవీ నరసింహారావును అవమానించడంపై రాజకీయ పార్టీలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.


నెల్లూరు కేంద్రంగా 80 ఏళ్లుగా..!

దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావుకు కాంగ్రెస్ అంటే అస్సలు పడేది కాదు. అయినా... నంద్యాలలో పీవీ పోటీచేసినప్పుడు ఆ స్థానానికి టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపలేదు. మన తెలుగువాడు ప్రధాని అయితే మన తెలుగుజాతికే గర్వకారణమని తన గొప్పతనం చాటుకున్నారు. ఇప్పుడా విషయాన్ని గుర్తుతెచ్చుకుంటూ నెల్లూరీయులు స్వర్గీయ ఎన్టీఆర్, పీవీలను కీర్తిస్తున్నారు. వాస్తవానికి నెల్లూరు కేంద్రంగా 80 ఏళ్లుగా ఆనం కుటుంబం రాజకీయాలను శాసిస్తుంది. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ రికార్డ్‌ సాధించారు. ప్రజలు నేరుగా ఆయన ఇంటికి ఏ సమయంలోనైనా వెళ్లి సమస్యలు చెప్పుకునేంతటి స్వేచ్ఛ ఉండేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 


మంచి పేరు రాకూడదనేనా..!?

అయితే ఇటీవల ఆనం వివేకానందరెడ్డి జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో మున్సిపల్ సిబ్బంది వివేకా ఫ్లెక్సీలను తొలగించడం పెద్ద దుమారం రేపింది. ఈ పరిణామాలతో వివేకానందరెడ్డి తనయుడు రంగమయూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు‌. మంత్రి అనిల్ కుమార్‌ అనుచరులు, చోటామోటా నేతల భారీ ఫ్లెక్సీలు నగరమంతా ఉన్నాయనీ.. వాటిని తొలగించే ధైర్యం మున్సిపల్ అధికారులకు లేదని వివేకా కుటుంబ సభ్యులు, ఆయన వర్గీయులు ఆక్రోశిస్తున్నారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదంటున్నారు. టీడీపీకి, ఆనం కుటుంబానికి మంచి పేరు రాకుండా చేయాలనే దురుద్దేశంతో ఫ్లెక్సీలను తొలగించారని పెదవి విరుస్తున్నారు.


ప్రతి కుటుంబానికి తోడుగా..!

మరోవైపు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్లెక్సీలు తొలగించిన విషయాన్ని తప్పుబట్టారట. నెల్లూరు నగర ప్రజలకు ఆనం కుటుంబం ఎప్పుడూ దూరం కాదని, వివేకాను అభిమానించే ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటామన్నారు ఆనం రామనారాయణరెడ్డి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆనం కుటుంబీకుల మార్క్ చూపిస్తామన్నారు. వివేకానందరెడ్డి మరణంతో ఆనం కుటుంబం నగరానికి దూరమైందని భావించడం సరైంది కాదన్నారు. మరోవైపు వైసీపీలో విభేదాలు అరికట్టడంలో మంత్రి అనిల్ కుమార్‌ విఫలమయ్యారని నెల్లూరీయులు విమర్శిస్తున్నారట. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయన గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారట.

Updated Date - 2020-12-27T18:36:33+05:30 IST