‘చెత్త’ పనిపై విచారణ
ABN , First Publish Date - 2020-12-27T08:07:55+05:30 IST
బ్యాంకుల ముందు చెత్తను డంపింగ్ చేసిన ఘటనపై పురపాలక శాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
![‘చెత్త’ పనిపై విచారణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉయ్యూరులో అధికారులను విచారించిన బృందం
విజయవాడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల ముందు చెత్తను డంపింగ్ చేసిన ఘటనపై పురపాలక శాఖ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మున్సిపల్ రీజినల్ డైరెక్టర్(గుంటూరు) జి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు జి.శేఖర్, జి.వెంకటేశ్వర్లును విచారణాధికారులుగా నియమించింది. శనివారం ఈ విచారణ బృందం కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులను విచారించింది. ఈ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంది. బ్యాంకుల్లోనూ విచారణ చేయాల్సి ఉన్నప్పటికీ శనివారం సెలవు కారణంగా సాధ్యం కాలేదు.
కాగా ఉయ్యూరులో నాలుగు బ్యాంకుల ముందు చెత్తను డంప్ చేసిన ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని కమిషనర్ సూర్యప్రకాశరావు తెలిపారు. తనకు సమాచారం రాగానే వెంటనే దాన్ని తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లించి, శానిటైజ్ చేశామని వివరించారు. బ్యాంకర్ల మనోభావాలు దెబ్బతీయాలని గానీ, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు.