అమరావతి పనుల నిలిపివేతతో కుంటుపడిన అభివృద్ధి
ABN , First Publish Date - 2020-06-01T08:55:24+05:30 IST
అమరావతి పనుల నిలిపివేతతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అమరావతి రైతులు అవేదన వ్యక్తం చేశారు.
రాజధాని రైతుల ఆవేదన..
166వ రోజు కొనసాగిన ఆందోళనలు
గుంటూరు, మే 31(ఆంధ్రజ్యోతి): అమరావతి పనుల నిలిపివేతతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అమరావతి రైతులు అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేసు ్తన్న ఆందోళనలు ఆదివారానికి 166వ రోజుకు చేరాయి. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారు కూర్చొని ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో రైతులు, మహిళలు, కూలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సంవత్సరం క్రితం అమరావతికి పడిన సంకెళ్లు ఎప్పుడు వీడతాయో అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులుగా 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కి న్యాయం చేయండి అంటూ ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని అవేదన వ్యక్తం చేశారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ రాత్రి 7.30 నుంచి అరగంట పాటు ఇళ్లలోని విద్యుత్ దీపాలు ఆపి కొవ్వొత్తులు వెలిగించి, దీపాలు వెలిగించి సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడకలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.