తక్షణం ‘బెంగళూరు’ ఎన్నికలు
ABN , First Publish Date - 2020-12-05T07:59:44+05:30 IST
బృహన్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలు వెంటనే నిర్వహించాని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వెళ్తే ఆలస్యం అవుతుందని, అలా ఎన్నికలను ఆపవద్దని హైకోర్టు ఆదేశించింది.

కర్ణాటక హైకోర్టు ఆదేశం
‘బెంగళూరు’ ఎన్నికలు నిర్వహించండి
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆపలేం: హైకోర్టు
బెంగళూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): బృహన్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలు వెంటనే నిర్వహించాని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వెళ్తే ఆలస్యం అవుతుందని, అలా ఎన్నికలను ఆపవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బెంగళూరు పాలికె ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఆరు వారాల్లో చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. పాలికె ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ శివరాజ్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. నవంబరు 25నే వాదనలు పూర్తికాగా తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. తాజాగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. దీంతో ఒక్కసారిగా బెంగళూరులో రాజకీయం వేడెక్కింది. బెంగళూరు పాలికెలో ప్రస్తుతమున్న 198 వార్డులను 243కు పెంచాలన్న నిర్ణయం సమంజసమైనదే అయినా ప్రస్తుత ఎన్నికలకు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. 198 వార్డులకే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. పాలక వర్గం గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారిని నియమించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.