కరోనా సమయంలో మంటగలిసిన మానవత్యం...

ABN , First Publish Date - 2020-06-07T18:39:47+05:30 IST

కరోనా సమయంలో మానవత్యం మంటగలుస్తోంది.

కరోనా సమయంలో మంటగలిసిన మానవత్యం...

నెల్లూరు జిల్లా: కరోనా సమయంలో మానవత్యం మంటగలుస్తోంది. కరోనా భయంతో కన్న తల్లిదండ్రులను రోడ్డుమీద వదిలేసిన ఘటన నెల్లూరు జిల్లా, మర్పిపాడు మండలం, కేటుకుంట గ్రామంలో జరిగింది. ఏడుగురు సంతానం ఉన్నా ఆ వృద్ధ దంపతులను ఎవరూ చేరదీయడంలేదు. దీంతో చేసేదిలేక ఆ వృద్ధ దంపతులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పొంగూరు గ్రామానికి చెందిన నేలటూరు దేవదాసు, పిచ్చమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. చెన్నై, బెంగళూరులో ముగ్గురు స్థిరపడ్డారు. మిగిలినవారు సొంత గ్రామమైన పొంగూరులోనే ఉన్నారు. 


దేవదాసు దంపతులు లాక్ డౌన్‌కు ముందు చెన్నైలోని కుమారునివద్దకు వెళ్లారు. చెన్నైలో మూత్ర సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడ్డారు. వైద్య పరీక్షలు చేయించడం చెన్నైలోని కుమారుడు, కుమార్తెకు భారమైంది. ఆధార్ కార్డు ఏపీలో ఉన్నందున తమిళనాడులో ఉచిత వైద్యం అందుకోలేకపోయారు. దీంతో దేవదాసు మనుమడు వారిని సొంతూరిలో వదిలి వెళ్లిపోయాడు. ఇక్కడ ఆ దంపతులను రక్తసంబంధీకులు ఇంట్లోకి అనుమతించలేదు. చెన్నై నుంచి వచ్చినందున ఆత్మకూరు వైద్యశాల వద్ద ఉంచాలంటూ అధికార్లకు తెలిపారు. తాము కూడా అక్కడికే వస్తామని సమాచారం ఇచ్చారు. అలా అన్నారేగాని వారు పట్టించుకోలేదు. నెల్లూరు పాలెం సెంటర్లో వృద్ధ దంపతులను చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వృద్ధ దంపతులను ఆత్మకూరు వైద్యశాలలో చేర్చారు. క్వారంటైన్ కేంద్రంలో చేరుస్తామన్న అధికారులు కూడా మొహం చాటేశారు. కడుపున పుట్టిన బిడ్డలు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో దేవదాసు దంపతులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2020-06-07T18:39:47+05:30 IST