నెల్లూరులో హైఅలర్ట్ !
ABN , First Publish Date - 2020-04-01T15:51:14+05:30 IST
నెల్లూరులో హైఅలర్ట్ !

- నగరంలోని 43, 47 డివిజన్లుగా రెడ్జోన్గా ప్రకటన
- అక్కడివారు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు
- ఇంటి వద్దకే నిత్యావసరాలు కొన్ని ప్రదేశాల్లో కర్ఫ్యూ ?
నెల్లూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రశాంతంగా ఉన్న జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో ఢిల్లీ మత సమావేశం తాలూకు ప్రకంపనలు అలజడి సృష్టించాయి. దీంతో నెల్లూరు నగరం హైఅలర్ట్ అయ్యింది. నగరంలోని రెండు డివిజన్లను రెడ్ జోన్లుగా మంగళవారం అధికారులు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్గా ధ్రువీకరించిన కేసులన్నీ ఈ సమావేశానికి హాజరైన వారివే కావడం.. ఆ సమావేశానికి జిల్లా నుంచి 34 మంది హాజరు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు మూడు, నాలుగు రోజులకు ముందే వీరిలో చాలామందిని ఆసుపత్రులకు, హౌస్ ఐసొలేషన్కు తరలించినా, ఈ సమావేశానికి హాజరైన వారిలో చాలా మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
దీంతో జిల్లా నుంచి వెళ్లి వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వీరి స్వాబ్ రిపోర్టులు మంగళవారం రాత్రికి వచ్చే అవకాశం ఉంది. అందరికి నెగిటివ్ రిపోర్టు వస్తే సంతోషమే. ఒకవేళ వీరిలో పాజిటివ్ కేసులుంటే మాత్రం మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. వీరు ఎవరెవరిని కలిశారో వారందరిని గుర్తించి హోమ్ ఐసొలేషన్కు తరలించాలి. ఈ విషయమై అధికారుల్లో, ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు నగర పరిధిలో ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగి ఉంటుందనే అనుమా నంతో 43,47 డివిజన్లను రెడ్ జోన్లుగా కలెక్టర్ ప్రకటించారు. అక్కడివారు ఇంటి నుంచి బయటకు రాకుండా నిత్యావసర వస్తువులను ఇళ్ల వద్దకే అందజేసేలా చర్యలు తీసుకున్నారు.