సీఎంకూ నోటీస్!
ABN , First Publish Date - 2020-02-12T09:18:37+05:30 IST
‘‘రాజధాని తరలింపును లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఖరికి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కూడా...
![సీఎంకూ నోటీస్!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021203445136/02122020034828n8.jpg)
మంత్రులు, సీఎస్కూ ఇస్తాం.. ‘తరలింపు’పై హైకోర్టు వ్యాఖ్య
- న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రభుత్వ పెద్దల వ్యాఖ్యలున్నాయి
- వాదనలు వినిపించిన లాయర్లు.. కౌంటర్ దాఖలుకు బెంచ్ ఆదేశం
- జడ్జీలు రాజధానిలో భూములు కొన్నారని మంత్రుల దుష్ప్రచారం
- చంద్రబాబు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని సీఎం అంటున్నారు
- బిల్లులు పెండింగ్లో ఉండగానే పరోక్షంగా తరలింపు యత్నాలు
- విశాఖ మిలీనియం టవర్స్కు ఆ ఉద్దేశంతోనే నిధుల మంజూరు
- సచివాలయంలో విజిలెన్స్ భాగం.. దాన్నెలా కర్నూలుకు తరలిస్తారు?
- పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు.. చోటు చాలకే విజిలెన్స్ కర్నూలుకు
- టవర్ అభివృద్ధి కోసమే నిధులు.. ధర్మాసనం ముందు ఏజీ నివేదన
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని తరలింపును లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఖరికి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కూడా మాట్లాడుతున్నారు’’’ అని రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు రాజధానిపై ఎలాపడితే అలా మాట్లాడుతున్నారని, నిపుణుల కమిటీలు వేసినప్పటికీ అవి ప్రభావితమయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు....ముఖ్యమంత్రికీ, మంత్రులకూ నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే కోర్టు సమయం మించిపోవడంతో నోటీసుల జారీకి అవకాశం లేకపోయింది. తదుపరి వాదనలను బుధవారానికి చీఫ్జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాయిదావేసింది.
విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జారీచేసిన జీవోతో పాటు, విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్-బి నిర్మాణ పనుల కోసం రూ.19.73కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎం.రమేశ్, రాజధాని అభివృద్ధి పనుల సమీక్షను అడ్డుకోవాలని కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేలకు రామారావు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పాటిబండ్ల సుధాకర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం మరోసారి విచారణ జరిగింది.
నోట్ఫైల్పై సీఎస్ సంతకం లేదు: లాయర్లు
‘‘ప్రభుత్వ ముఖ్యుల వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, న్యాయమూర్తులు, ఏజీలు, పత్రికాధిపతుల చేతుల్లో రాజధాని భూములున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు వ్యాఖ్యానించారు. పబ్లిక్ సర్వెంట్లుగా ఉండి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడ్డమంటే అది చట్ట నిబంధనల ఉల్లంఘనే. ఐఏఎస్ అధికారులు సైతం రాజధాని వ్యవహారంలో సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే పేర్కొన్నారు’’ అని ఉన్నం మురళీధరరావు ఆరోపించారు. రాజధానిలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని విమర్శించారు. రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం పరోక్షంగా చేయాల్సినదంతా చేస్తోందన్నారు.
‘‘విశాఖ మిలీనియం టవర్-బి నిర్మాణ పనుల కు రూ.19.73కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. టవర్-1లోని ఐటీ కంపెనీ ఖాళీ చేయిస్తున్నారు. విశాఖకు కార్యాలయాలను తరలించేందుకే ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాశ్, కోన శశిధర్ వంటివారు మిలీనియం టవర్ను పరిశీలించారు. విశాఖకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా హెచ్వోడీలకు మౌకిక ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోండి. ఈ ప్రక్రియకు సంబంధించిన జీవోలను రద్దు చేయండి’’ అని కోరారు. రాజధాని నగర మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించడానికి లేదని, రైతుల నుంచి భూముల స్వీకరణ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ ఇచ్చిన హామీని నెరవేర్చాలని సుధాకర్రావు అంబటి వాదించారు.
సచివాలయంలో భాగమైన విజిలెన్స్ కార్యాలయాలను కర్నూలుకు తరలించడం సరి కాదని కారుమంచి ఇంద్రనీల్బాబు వాదించారు. దీనిపై ప్రభుత్వ నోట్ఫైల్స్లో సీఎస్ సంతకం లేదని, ఈ వ్యవహారంలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు. కాగా, విజిలెన్స్ కమిషన్ స్వతంత్ర సంస్థ అని, ఆ కార్యాలయానికి సచివాలయంతో సంబంధం లేదని ఏజీ ఎస్ శ్రీరాం వాదించారు. ‘‘ప్రభుత్వశాఖల్ని విజిలెన్స్ కమిషన్ పర్యవేక్షిస్తుందేతప్ప అది ప్రభుత్వ శాఖల్లో భాగం కాదు. సచివాలయంలో తగిన స్థలం లేకపోవడం వల్లే కర్నూలుకు తరలించాల్సి వచ్చింది’’ అని వివరించారు. విశాఖలో మిలీనియం టవర్ పనులు 2016నుంచే కొనసాగుతున్నాయని, దానిలో భాగంగానే రూ.19.73 కోట్లు కేటాయించామని చెప్పారు.
అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, వాటిని తాము అడ్డుకోబోమని ఈ సమయంలో ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్మాణాల పట్ల తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించింది. ఆ అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఇదేతమకు ముఖ్యమని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన, ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, సీఎం సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.