-
-
Home » Andhra Pradesh » He is everything
-
సర్వం ఆయనే!
ABN , First Publish Date - 2020-12-10T09:07:27+05:30 IST
ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లు, ప్లాన్లు, వాటి అంచనాలు చూస్తారు. పరిపాలన అధికారులు సర్వీసు విషయాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. అటు ఇంజనీరింగ్, ఇటు ఆర్థి క బిల్లులు విరుద్ధమైనవి కావడంతో ఎప్పుడూ ఒక చేతిలో ఉండవు.

‘హౌసింగ్’లో ఇంజనీరింగ్ అధికారికి పెత్తనం
పరిపాలన, ఆర్థిక బాధ్యతలూ ఆయనకే
గత ప్రభుత్వంలోనూ చక్రం తిప్పి విమర్శలపాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లు, ప్లాన్లు, వాటి అంచనాలు చూస్తారు. పరిపాలన అధికారులు సర్వీసు విషయాలు, ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటారు. అటు ఇంజనీరింగ్, ఇటు ఆర్థి క బిల్లులు విరుద్ధమైనవి కావడంతో ఎప్పుడూ ఒక చేతిలో ఉండవు. అయితే, వైసీపీ ప్రభుత్వంలోలాగే గృహనిర్మాణ కా ర్పొరేషన్లోనూ రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ముఖ్య అధికారికి పరిపాలనతో పాటు ఆర్థిక వ్యవహారాలు కట్టబెట్టడం అధికార వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు పరిపాలన, ఇంటి బిల్లుల విడుదల వ్య వహారాలు చూసిన జనరల్ మేనేజర్ స్థాయి అధికారి సోమవారం రిటైరయ్యారు. దీంతో వెంటనే ఆ బాధ్యతలను ఇంజనీరింగ్ అధికారికి అప్పగించారు. ఇప్పటికే హౌసింగ్లో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తూ, కొత్త ఇళ్ల నిర్మాణ పనుల్లో తలమునకలైన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారుల కొరత ఉ న్నప్పుడూ ఏ విభాగం అధికారులకు ఆ విభాగం బాధ్యతలే ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు సంబంధం లేని అధికారికి ఎందుకు ఇవన్నీ ఇచ్చారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అధికారి గత ప్రభుత్వంలోనూ ఇంజనీరింగ్ విభాగంలో చక్రం తిప్పారు. అంతా తానే అన్నట్టు చేస్తున్నారనే విమర్శలు రావడంతో కొంతకాలం పక్కనపెట్టారు. ప్రభుత్వం మారినా ఇప్పుడు మళ్లీ ఆయనకే అన్నీ కట్టబెట్టారు. ప్రభుత్వం కొత్తగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగం రూపొందించిన అంచనాలపై అనేక విమర్శ లు వస్తున్నాయి. మార్కెట్లో నిర్మాణ సామగ్రి వ్యయం భారీ గా పెరిగిపోతున్న క్రమంలో అతి తక్కువ ధరకే ఇంటికి అవసరమైన మొత్తం మెటీరియల్ లభిస్తుందంటూ ఇంజనీరింగ్ విభాగం అంచనాలు తయారుచేసింది.
పట్టణాల్లో నిర్మించబోతున్న ఇళ్లకు ప్రభుత్వమే సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుకలు, తలుపులు, కిటికీలు, మరుగుదొడ్డి సామాగ్రి, విద్యుత్ పరికరాలు మొత్తం కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించనుంది. అయితే ఇవన్నీ రూ.1.2 లక్షలకే వస్తాయని, లబ్ధిదారులపై రూపాయి భారం ఉండదంటూ లెక్కలు వేశారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఈ ధరకు సమకూరడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రిటైర్ కాబోతున్న ఆ అధికారి, రిటైర్మెంట్ తర్వాత కూడా విధుల్లో కొనసాగేందుకు ప్రభుత్వాన్ని ఇలా తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.