30 వరకు కూల్చివేతలొద్దు

ABN , First Publish Date - 2020-10-27T08:32:28+05:30 IST

విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 30వ తేదీ వరకు కట్టడాల తదుపరి కూల్చివేతలు వద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

30 వరకు కూల్చివేతలొద్దు

‘గీతం’పై హైకోర్టు ఆదేశాలు

అప్పటిదాకా నిర్మాణాలు చేయొద్దు

వర్సిటీ యాజమాన్యానికి స్పష్టీకరణ


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 30వ తేదీ వరకు కట్టడాల తదుపరి కూల్చివేతలు వద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని ‘గీతం’ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


వర్సిటీకి చెందిన కట్టడాలను అధికారులు తొందరపాటుతో కూల్చివేస్తున్నారంటూ ‘గీతం’ కార్యదర్శి మోహనరావు గత శనివారం హైకోర్టులో హౌస్‌మోషన్‌ (అత్యవసర) పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అదేరోజు విచారణ జరిపిన న్యాయమూర్తి, తదుపరి కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించారు. అదే విధంగా ఆదివారం ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి వాదనలు విన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ తరఫు న్యాయవాది సీవీఆర్‌ రుద్రప్రసాద్‌, అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేసేందుకు గడువు కోరారు. అదేవిధంగా రెవెన్యూశాఖ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కూడా కౌంటర్‌ దాఖలుకు నాలుగు వారాల గడువు కోరారు. 

Updated Date - 2020-10-27T08:32:28+05:30 IST