ఒడ్డుకు చేరిన ‘టార్గెట్‌ డ్రోన్‌’ శకలాలు

ABN , First Publish Date - 2020-12-07T09:22:32+05:30 IST

పులికాట్‌ సరస్సులో టార్గెట్‌ డ్రోన్‌ క్షిపణి శకలం బయటపడింది. తమిళనాడు పోన్నేరి తాలూకా కోరైకుప్పం గ్రామ పరిధిలోని పులికాట్‌ సరస్సులో శనివారం వేటకు వెళ్లిన మత్స్యకారులు దీన్ని గుర్తించారు.

ఒడ్డుకు చేరిన ‘టార్గెట్‌ డ్రోన్‌’ శకలాలు

ఉలవపాడు, తడ, డిసెంబరు 6: పులికాట్‌ సరస్సులో టార్గెట్‌ డ్రోన్‌ క్షిపణి శకలం బయటపడింది. తమిళనాడు పోన్నేరి తాలూకా కోరైకుప్పం గ్రామ పరిధిలోని పులికాట్‌ సరస్సులో శనివారం వేటకు వెళ్లిన మత్స్యకారులు దీన్ని గుర్తించారు. 2 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ డ్రోన్‌ గురించి గున్నేరి పోలీసులకు సమాచారం అందించారు. వారు రెవెన్యూ అధికారులతో కలసి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దీనికి సంబంధించిన మరో శకలం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం సముద్రతీరంలోకి కొట్టుకొచ్చింది. మత్స్యకారులు సమాచారం ఇవ్వడంతో మెరైన పోలీసు స్టేషన్‌ సీఐ కిశోర్‌కుమార్‌ దాన్ని స్టేషన్‌కు తరలించారు. ఉలవపాడు తహసీల్దార్‌ సంజీవరావు ఆదివారం దీన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. దీన్ని ఒడిసా రాష్ట్రంలోని బాలాసోర్‌ మధ్యస్థ శ్రేణి క్షిపణి ప్రయోగశాల నుంచి 3 నెలల క్రితం ప్రయోగించిన టార్గెట్‌ డ్రోన్‌ క్షిపణిగా నిర్ధారించారు. ఇలాంటి డ్రోన్‌ క్షిపణిలు నిర్దేశిత లక్ష్యం పూర్తయిన తర్వాత సముద్రంలో కూలిపోతాయని, అవి ఎక్కడో ఒకచోట తీరంలో ఒడ్డుకు రావటం సాధారణమని పోలీసులు తెలిపారు. రక్షణ రంగంలో ఇలాంటి డ్రోన్‌లను అన్ని దేశాలూ వినియోగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-07T09:22:32+05:30 IST