నేతన్నలకు జగన్ ద్రోహం: నిమ్మల
ABN , First Publish Date - 2020-06-22T09:25:08+05:30 IST
చేనేత వృత్తిదారులకు సీఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): చేనేత వృత్తిదారులకు సీఎం జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. నేతన్న నేస్తం పథకం చేనేతదార్ల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3.5 లక్షల మంది చేనేత వృత్తిదారులుంటే, 81 వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ‘మగ్గాలున్న చేనేత వృత్తిదారులందరికీ నేతన్న నేస్తం అమలు చేయాలి. బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిగా నేతన్నల సంక్షేమానికి ఖర్చు చేయాలి. కేంద్రం కేటాయించిన రూ.31 కోట్లకు మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయాలి. సిల్క్ యార్న్ కొనుగోళ్లపై సబ్సిడీ ఇవ్వాలి. సిల్క్ వస్త్రాల నేతదార్లకు నెలకు రూ.వెయ్యి సాయం అందించాలి. లాక్డౌన్లో 3 నెలలు ఖాళీగా ఉన్న నేతన్నలను ఆదుకోవాలి. టీడీపీ హయాంలో అమలు చేసిన నేతన్నల అభ్యున్నతి పథకాలు కొనసాగించాలి’ అని డిమాండ్ చేశారు.